14 October 2011

ఒక్కసారి

(రెండు కళ్ళు మాయమౌతాయి)

మౌనం ఒక స్మృతి గీతం

నువ్వేమీ నాకు చెప్పలేనప్పుడు
నేనేమీ నీకు అందించలేనప్పుడు

మనం మన శరీరాల్ని
శరీరాలు లేని చోటికి

తీసుకువెళ్ళడమే మంచిది
మరణించినదాన్ని
మరణించనివ్వడమే మంచిది:

వెళ్ళిపోదాం అప్పటిదాకా

అద్దంలోంచి అద్దంలోకి అద్దాలతో
అద్దాల ప్రతిబింబాలతో
బొమ్మలతో బొరుసులేని తనతో:

=చితికి వెడుతో చింతిస్తో
చింతను గురించి చింతించి

ఏం లాభం? ఏం వరం?=

ఉండిపో అక్కడే
ఇక్కడైన అక్కడే

ఇక. ఒకసారి. ఒక్కసారి.

నేను నిన్ను పిలవను
ఇక. ఒకసారి. ఒక్కసారి.
ఒకేసారి.

1 comment:

  1. చాల బాగుంది. ఎందుకో సరిగ్గా తెలియదు, మనస్సును పిండినట్టుగా ఉంది. చితి, చింత పదాలున్నందుకని కాదు, 'మో' దృష్టిలో ఉన్నాడనిపించింది. మో అని కాదు, తెలిసిన వాళ్ల మరణం బహుశా మొత్తంగా మరణాన్నీ, దాని అనివార్యతనూ గుర్తు చేసి ఒక రకం బాధ లోనికి మనల్ని నెడుతుందనుకుంటా. ఒక ఫ్యుటిలిటీని గుర్తు చేస్తుందనుకుంటా. ఏమో. అది కాదు. ఏదీ కాదు. ఈ పద్యం చాల చాల బాగుంది. మౌనాన్ని రెండు కళ్లు మాయమైపోవడంగా, స్మృతిగీతంగా పరిచయం చేసినప్పుడే (నా) లోపల ఎవరో వెక్కి వెక్కి ఏడుస్తున్న చప్పుడు వినిపించింది.

    ReplyDelete