14 January 2013

అమ్మ చెప్పిన కథ

"అమ్మా చలేస్తే, మనం దుప్పట్లు కప్పుకుంటాం. మరి పిట్టలూ?"

కరెంట్ పోయిన చీకట్లో, కొవ్వొత్తిని వెలిగిస్తూ ఆ తల్లి చెప్పింది ఇలా:
పిచ్చి కన్నా, చలేస్తే పిట్టలు ఆకుల్ని కప్పుకుంటాయి
ఆకులు ఆకాశాన్ని కప్పుకుంటాయి, ఆకాశం చుక్కల్నీ
చుక్కలు నీ కళ్ళనీ కప్పుకుంటాయి

నీ కళ్ళని అమ్మా, అమ్మని నాన్నా, నాన్నని నీ తమ్ముడూ
నీ తమ్ముడిని తాతా, తాతని నాయనమ్మా
నాయనమ్మని ఈ ఇల్లూ కప్పుకుంటుంది -

ఈ ఇంటిని వేపచెట్టూ, వేపచెట్టుని నేలా, నేలను గాలీ మరి గాలిని
పచ్చని చేలూ, చేలని నీరూ, నీరుని నిప్పూ
కప్పుకుంటాయి. ఇక పూలని పురుగులూ
పురుగులని పుట్టలూ, పుట్టల్ని పాములూ
పాములని పరమ శివుడూ, ఆ శివుడుని

పార్వతీ, పార్వతిని ఈ భూమి, ఈ భూమిని
పగలూ రాత్రీ మార్చిమార్చి కప్పుకుంటాయి.
ఇక పడుకుందామా?" అని తను తల తిప్పి

పక్కకు చూసేటప్పటికి, మంచంపై పిట్టలూ ఆకులూ పూవులూ
చుక్కలూ, నింగీ నేలా నీరూ నిప్పూ  గూళ్ళూ
చెట్లూ పుట్టలూ పురుగులూ, పగలూ రాత్రీ

వెన్నెల వాసనా, చల్లటి నిద్రా తెరలుతెరలుగా కదులాడే గంధపు
వదనంతో ఒక పిల్లవాడు నోరు తెరుచుకుని
నిద్రపోయి ఉన్నాడు-                            

2 comments:

  1. హ హా...అదే మరి అమ్మ కమ్మని కథలోని మహత్యం!
    బాగుంది.

    ReplyDelete
  2. what a wonderful poem.a great imagination

    ReplyDelete