07 February 2013

నువ్వు అడిగే విషయాలు

ఈ రాత్రి ఏమయ్యిందని నువ్వు అడుగుతావు

నేను ఏమీ చెప్పను.
పిల్లలు మరో మారు మరణించారనీ, పత్రికలు వార్తలు ముద్రించాయనీ
ప్రధాన మంత్రి ఎవరైతే, ఈ దేశాన్ని సుభిక్షంగా ఉంచుతారనే సర్వేలలో

హస్తాలు లేని మనుషులనీ, కమలాలు లేని గృహాలనీ
ఎవ్వరూ పట్టించుకోలేదనీ, యధాప్రకారం ధారావాహిక
కార్యక్రమాలలో నువ్వూ నేనూ కూరుకుపోయామనీ, మన ముఖాలని

మరచిపోయామనీ ఎవరూ చెప్పరు. విచిత్రం ఏమిటంటే

ఈ రాత్రి ఏమయ్యిందని నువ్వు అడుగుతావు కానీ
ఇదొక్కటే నిజం విను. ఇంకా లెక్క తేలలేదు

ఈ నేలపై, నేలను అడిగినందుకు పిల్లలు హత్యలు చేయబడ్డారే తప్ప
పిల్లలెవరూ మరో మారు చనిపోలేదు-

ఆచార్యా, కొద్దిగా భాష నీ మార్చుకో. ఇంతకూ ఇన్ని పత్రికలని నీ నాలికపై
ఇంత నిస్సిగ్గుగా ముద్రించినది ఎవరు?  

1 comment: