27 September 2015

నివేదన

అవాంతరాలూ  అడ్డంకులూ ఏమీ లేకుండా  అహ్మద్ ఆ రోజు త్వరగా ఇంటికి చేరుకున్నాడు.

అతను కనపడగానే, ఆ రోజు -  దారుల్లో  వీధుల్లో  ఎవరూ  మైకుల వాల్యుమ్ పెంచలేదు. అతను  వీధి మలుపు తిరగగానే  చేతులకీ, నెత్తులకీ కాషాయపు రంగు నెత్తురు గుడ్డలతో అతనిని చూసి ఎవరూ వంకరగా నవ్వలేదు.  నడుస్తూ నడుస్తూ తల ఎత్తితేఆ రోజు ఎవరూ గార పట్టిన గుట్కా పళ్ళతో, మందు వాసనతో చీత్కారంగా కాండ్రించి  ఊస్తూమూడు గుండీలు విప్పిన  అంగీని వెనక్కి తోసుకుంటూ కనుబొమ్మలను కవ్వింపుగా ఎగుర వేయలేదు. ప్రతి సందూ కబ్జా అయ్యి ఒక రామ మందిర నిర్మాణమయ్యీ, అతను వాళ్ళని దాటుకుని ఒదిగొదిగి వెడుతున్నప్పుడల్లా ఎప్పటిలా లీలగా 'ఇస్కీ బెహెన్కి చోత్', మాధర్చోత్  అనే పదాలు అతని వెన్నుని తాకలేదు. ఒక మస్జీద్ అతని హృదయంలో కూలగొట్టబడలేదు. దాటుకుంటూ వచ్చిన ప్రతి వీధిలోనూ  అతన్ని చూసీ చూడగానే ఎవరూ జై శ్రీరాం అని నినదించలేదు. ఉన్మాద నృత్యాలతో  గణగణగణమనే గంటలతో, నుదిటిన త్రిశూలాల వంటి బొట్లతో ఎవరూ అతన్ని భయభ్రాంతుడని  చేయలేదు. అతని ఒళ్లంతా ఆ రోజు కుంకుమతో అస్తమయం కాలేదు. 

సరే. నిమజ్జనం ముగిసింది. ఏదో సద్దుమణిగింది. అతని నగరం కొంత తెరపి పడింది. ఇక

ఆవాంతరాలూ అడ్డంకులూ ఏమీ లేకుండా ఆ రోజు అహ్మద్ త్వరగా ఇంటికి చేరుకునిభార్య ఇచ్చిన మంచినీళ్ళు త్రాగి, తెచ్చిన అరటి పళ్ల సంచిని ఆరేళ్ళ పిల్లల చేతికిస్తుండగా గోడకి చతికిల బడిన అతని ముసలి తల్లి అంటుంది కదా -

"వచ్చావా నాయనాత్వరగా స్నానం చేసి భోజనం చేయి. ఇక ఈ పూటైనా పిల్లలు నిశ్చింతగా, కంటి నిండుగా నిదురోతారు"

No comments:

Post a Comment